‘డిటెక్టివ్’ను సంప్రదించి.. లక్ష సమర్పించి..
సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): కూతురు క్షేమం కోసం సద్గుణాలు ఉన్న అల్లుడు కావాలని కోరుకొని.. గూగుల్ సెర్చ్లో ఓ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించి బోల్తాపడ్డాడో వ్యక్తి. అత్తాపూర్కు చెందిన బాధితుడు(62) తన కుమార్తెకు వివాహం చేసేందుకు పలు మ్యాట్రిమోనీ సైట్లలో దరఖాస్తు చేశాడు. వరుడికి సంబంధించిన ప్రొఫైల్స్ అధిక సంఖ్యలో వచ్చాయి. వారిలో ఉత్తముడిని ఎంపిక చేసేందుకు గూగుల్ సెర్చ్లో డిటెక్టివ్ ఏజెన్సీ కోసం వెతికాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నానని ఆగంతకుడు కాల్ చేశాడు.
అతడిని కాబోయే అల్లుడి గురించి వివరాలు సేకరించాలని కోరగా, లక్ష అడ్వాన్స్తో పాటు వివరాలు, ఫొటో కావాలని చెప్పడంతో పంపించాడు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. దీంతో బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అయితే పరిధి సైబరాబాద్కు రావడంతో తండ్రి వయస్సు, ఆవేదనను గుర్తించి ఏసీపీ కేవీఎం ప్రసాద్ జీరో ఎఫ్ఐఆర్ ద్వారా కేసు నమోదు చేయగా, తదుపరి విచారణను సైబరాబాద్కు బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.