Hyderabad | హైదరాబాద్ : ర్యాష్గా డ్రైవింగ్ చేసి పలువురిని గాయపరిచిన ఘటనలో ఓ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికులంతా కలిసి డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అక్కడ పోలీసుల కళ్లుగప్పి పరారీ అయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. చార్మినార్ ఏరియాకు చెందిన అమీర్ అలీ అనే డ్రైవర్.. యాప్ ద్వారా కొన్ని వారాల క్రితం కారును బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత కారు రిజిస్ట్రేషన్ నంబర్ను, ఛాసిస్ నంబర్ను ట్యాంపర్ చేశాడు. ఇక కారు యజమాని మోహన్ రెడ్డికి డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నాడు అమీర్ అలీ.
శుక్రవారం రాత్రి అమీర్ అలీ పంజాగుట్ట వద్ద కారులో వెళ్తుండగా మోహన్ రెడ్డి గుర్తించాడు. దీంతో కారును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అలీ కారును వేగంగా తీసుకెళ్లడంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అమీర్ అలీని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.
గాయాలపాలైన అమీర్ అలీని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోలీసు కస్టడీలోనే ఉన్న అమీర్ చికిత్స పొందుతున్న క్రమంలో పోలీసుల కళ్లుగప్పి పరారీ అయ్యాడు. దీంతో అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.