హయత్నగర్, జూలై 7: నకిలీ పత్రాలతో పలు కార్లు, బైక్లను కొనుగోలు చేసి వాటిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని భువనగిరి ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద రూ.కోటి 26,50,511 విలువ చేసే ఆరు కార్లు, మూడు బైక్లు, నకిలీ స్టాంపులు, గుర్తింపు కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీకి చెందిన విశాఖపట్నం, అల్లీపురం గ్రామానికి చెందిన కరుమూరి వీరవెంకట సత్యా గుప్త నాగరాజ, అలియాస్ కె.వి.వి.ఎస్.జి.నాగరాజ, అలియాస్ రాజ (46), వృత్తిరీత్యా బిజినెస్ చేస్తుంటాడు. ఏపీలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో నాగరాజ 9వ తరగతి వరకు చదివాడు. అనంతరం టీఐ సైకిల్ ఆఫ్ ఇండియా అనే కంపెనీలో నెలకు రూ.15వేలు వేతనానికి రెండేళ్లు ఉద్యోగం చేశాడు. 2014లో ఓ చానెల్లో రిపోర్టర్గా పనిచేశాడు. 2015లో హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని వర్దన ఇండస్ట్రీస్ (ఫాస్ట్ కన్స్యూమర్ గూడ్స్ సరఫరా) పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతడి స్నేహితుడు సురేశ్ పెట్టుబడి పెట్టి డైరెక్టర్గా, మరో ఉగ్యోగి మర్దన శ్రావణిని కూడా 10శాతం వాటా కింద డైరెక్టర్లుగా నియమించుకున్నాడు.2018లో మహింద్రా ఎక్స్యూవీ 500 అనే వెహికల్ను నాగరాజ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోన్ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీఏ ఖైరతాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
కొన్ని నెలలు ఈఎంఐలు సరిగ్గానే చెల్లించిన తర్వాత నకిలీ స్టాంపులు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సంతకంతో నకిలీ ఫారం-35, ఎన్ఓసీలను సృష్టించాడు. కల్పిత పత్రాలను ఉపయోగించి తన కంపెనీ డైరెక్టర్ మర్దన శ్రావణిని కొనుగోలుదారుగా చూపి మరోసారి యాక్సిస్ బ్యాంక్ నుంచి రుణం పొందాడు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో శ్రావణి పేరుతో సదరు వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విధంగా పలుమార్లు ఆయా బ్యాంకుల నుంచి నకిలీ ఆధార్, ఇతర పత్రాలు, స్టాంపులను తయారు చేసి వాహనాలను కొనుగోలు చేసి వాటిని ఇతరులకు విక్రయించి బ్యాంకుల ద్వారా రుణాలు పొందసాగాడు. ఇప్పటి వరకు ఆరు ఫోర్వీల్లర్ వాహనాలు మహీంద్ర ఎక్స్యూవీ 500, ఇన్నోవా క్రిస్టా, హ్యూండాయి వెన్యూ, మహీంద్ర బొలెరో, మారుతీ ఎక్స్ఎల్6, రెనాల్డ్ క్విడ్, సుజికి ఆక్సిస్, రెండు హోండా ఆక్టివా వాహనాలను విశాఖపట్నంకు చెందిన శ్రావణి, నాగభూషణం, పిల్లవార సంతోష్కుమార్, విజయవాడకు చెందిన గుర్లంక లక్ష్మీకాంత్ సమన్వయంతో కొనుగోలు చేసి అవసరమైన వ్యక్తులకు వాటిని విక్రయించి డబ్బు సంపాదిస్తున్నాడు. నాగరాజుపై వనస్థలిపురం, హయత్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు భువనగిరి ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు నిందితుడు నాగరాజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద పలు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, నకిలీ స్టాంపులు, గుర్తింపు కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు బృందాలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఎస్వోటీ ఏసీపీ జి.నవీన్ కుమార్, హయత్నగర్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ జలేంధర్రెడ్డి, ఎస్ఐలు శోభన్బాబు, డి.ప్రవీణ్బాబు, జి.రఘురాముడు, సిబ్బంది పాల్గొన్నారు.