డబ్బులు తస్కరించిన వ్యక్తిపై కేసు
బంజారాహిల్స్, మే 29: వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.14లో నివాసముంటున్న 94 ఏండ్ల ఆర్ఆర్ఎస్ అర్ని విశ్రాంత ఉద్యోగి. అతడి కొడుకు, కూతురు, కుటుంబ సభ్యులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. మూడేండ్ల కిందట తల్లి చనిపోవడంతో తండ్రి బాగోగులు చూసుకునేందుకు కొడుకు విద్యుత్ అర్ని ఇంట్లో పని మనుషులతో పాటు ములుగు ప్రాంతానికి చెందిన ఉదయ్కుమార్ను అటెండెంట్గా నియమించాడు. సకాలంలో మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన అన్ని పనులు చేసిపెట్టే ఉదయ్కుమార్ నమ్మకంగా పనిచేశాడు.
దీంతో బ్యాంకుకు సంబంధించి పనులను కూడా అతడికి అప్పగించారు. తండ్రి ఎలా ఉన్నాడో చూసేందుకు ఇంట్లో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా విదేశాల్లో ఉన్న కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పరిశీలిస్తుంటారు. కాగా, సిబ్బంది జీతాలకు, ఇంటి ఖర్చులకు నెలకు రూ.3 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసేందుకు ఉదయ్ తన యజమాని చేత చెక్కుల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తండ్రిని చూసేందుకు వచ్చిన కొడుకు విద్యుత్ అర్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించాడు. లెక్కల్లో తేడాలు కనిపించాయి. మూడేండ్లలో తండ్రి అకౌంట్లో నుంచి సుమారు 40లక్షల మేర డబ్బులు తస్కరించినట్లు తేలింది. దీంతో ఉదయ్కుమార్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.