సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డులో మరో ఇంటర్ ఛేంజ్ అందుబాటులోకి రానుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రహదారిలో తొలుత 19 ఇంటర్ ఛేంజ్లు ఉన్నాయి. కాగా.., వాహనాల రద్దీ, స్థానికుల డిమాండ్ మేరకు కోకాపేట, నార్సింగి, మల్లంపేట – శంభీపూర్ మూడు చోట్ల కొత్తగా ఇంటర్ ఛేంజ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల నార్సింగి ఇంటర్ ఛేంజ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే న్యాయపరమైన చిక్కులతో కోకాపేట ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండగా, మల్లంపేట – శంభీపూర్ ఇంటర్ ఛేంజ్ వచ్చే నెల మొదటి వారం నాటి కల్లా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలతో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
నిజాంపేట, దుండిగల్ మున్సిపాలిటీల ఏర్పాటుతో గణనీయంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారంగా బాచుపల్లి ఫ్లై ఓవర్ పనులను హెచ్ఎండీఏ చేపడుతున్నది. దాదాపు రూ.40 కోట్లతో మల్లంపేట – శంభీపూర్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. 21వ ఇంటర్ ఛేంజ్గా ఈ నిర్మాణం జరుగుతున్నది. ఈ పనులను పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అర్వింద్ కుమార్ పర్యటించగా, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ యూసుఫ్ హుస్సేన్ బాచుపల్లి ఫ్లై ఓవర్, మల్లంపేట ఇంటర్ ఛేంజ్ల పనుల పురోగతిని అర్వింద్ కుమార్కు వివరించారు. బాచుపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 25 శాతం మేర పూర్తి చేసుకున్నదని, ఏడాదిలోగా ఈ ఫ్లై ఓవర్ పూర్తి అవుతున్నదని అధికారులు చెప్పారు. మల్లంపేట – శంభీపూర్ ఇంటర్ ఛేంజ్ను వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.