మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తృతీయ సంవత్సరంలోనే బహుళ జాతి కంపెనీలో మంచి వేతన ప్యాకేజీతో ఉద్యోగాన్ని దక్కించుకున్నారు. సీఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతున్న హితేశ కామ్వాల్ట్ కంపెనీలో రూ.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. అదే విభాగానికి చెందిన రంజన్ శర్మ, ఐటీకి చెందిన రాహుల్ సిద్దార్థ్ మానవ వనరుల నిర్వహణ సంస్థ టాబులేరాకు రూ.24 లక్షల ప్యాకేజీతో ఎంపికయ్యారు.
ముగ్గురు విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి కాకముందే ప్లేస్మెంట్ కైవసం చేసుకున్న సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ముగ్గురు విద్యార్థులు జావా, పైథాన్, ఎస్క్యూఎల్ తదితర అంశాల్లో అకాడమిక్ విద్యతో పాటు పట్టు సాధించడం బహుళ జాతి సంస్థలకు ఎంపిక కావడానికి తోడ్పడిందన్నారు. కార్యక్రమంలో ప్రాంగణ నియామక సమన్వయకర్త డాక్టర్ హేమారెడ్డి, సుజాతారెడ్డి పాల్గొన్నారు.