సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వ్యాపార భవనాల ఆధునీకరణ పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ చేపట్టింది. నగరంలోనే అత్యంత కీలక ప్రాంతమైన అమీర్పేటలో హెచ్ఎండీఏకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు భారీ బహుళ అంతస్థుల వ్యాపారాలు ఉన్నాయి. మైత్రీవనం, మైత్రీ విహార్తో పాటు స్వర్ణ జయంతి కమర్షియల్ కాంపెక్ల్సు పేరుతో మూడు వ్యాపార భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ వ్యాపార కార్యకలాపాలకే హెచ్ఎండీఏ అద్దెకు ఇస్తున్నది. ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా ఉన్న ఈ భవనాలను ఆధునీకరించి, మరింత ఆదాయాన్ని పెంచుకునే చర్యలు అధికారులు చేపట్టారు.
కరోనాతో చాలా రోజులుగా ఈ భవనాల్లో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎక్కువగా ఐటీ శిక్షణ సంస్థలు, ఇతర కార్యాలయాలు ఉండడంతో వాటిని ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం వీటిని ఆధునీకరించి అద్దెకు ఇవ్వడం ద్వారా అద్దెల రూపంలో వచ్చే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమీర్పేట ప్రాంతంలో వ్యాపార పరంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ హెచ్ఎండీఏకు చెందిన వ్యాపార భవనాల్లో స్థలాన్ని అద్దెకు తీసుకునేందుకు ముందుకు వస్తున్నా, అవి ఆధునికంగా లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు మొదట అమీర్పేటలోని మైత్రీవనం, స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్సులను ఆధునీకరించేందుకు సుమారు రూ. 85 లక్షలు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. రెండు వ్యాపార భవనాల్లో ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేసి, అద్దెకు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని అధికారులు తెలిపారు.