మైలార్దేవ్పల్లి, ఆగస్టు 24: శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్శాఖ నంబర్వన్గా పనిచేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ను గురువారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, డీజీపీ అంజనీ కుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం విలేకరులతో హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం నూతన పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నదన్నారు. గత తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచి.. శాంతి భద్రతలు కాపాడటంలో ముందు వరుసలో నిలిచేలా చేశారని తెలిపారు.
పోలీసు వ్యవస్థ బాగున్నప్పుడే ప్రజలు బాగుంటారని అన్నారు. నిఘా నేపథ్యంలో 64 శాతం సీసీ కెమెరాలతో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. నూతన పోలీసు స్టేషన్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. శాంతి భద్రతలు బాగుండటంతో క్రైమ్ కూడా చాలా వరకు తగ్గిందని, పోలీసుల పనితీరుతో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రహమత్ బేగ్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, ఏసీపీ గంగాధర్, మైలార్దేవ్పల్లి పోలీసు ఇన్స్పెక్టర్ పి.మధు, ఇతర స్టేషన్ల ఇన్ స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.