మహేశ్వరం, నవంబర్ 17: మరో హైటెక్సిటీగా తుక్కుగూడ దినదినం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రికి పెద్దఎత్తున మున్సిపాలిటీ ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. రూ.6600 కోట్లతో శంషాబాద్ నుంచి తక్కుగూడ మీదుగా కందుకూరు వరకు మెట్రో రైలు రానుందన్నారు. అతి త్వరలోనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనున్నదన్నారు.
ఇప్పటికే 52 కంపెనీలు వచ్చాయని, పాక్స్కాన్ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. కందుకూరు మండలానికి 450 పడకలతో మెడికల్ కళాశాల రానున్నదన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను రూ. 2016 నుంచి రూ.5016 వరకు, 93 లక్షల మందికి ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా, రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం, వికలాంగులకు రూ.4016 నుంచి 6016 వరకు పెంపు, రైతుబంధు ఎకరానికి రూ.16వేలు, సౌబాగ్యలక్ష్మి ద్వారా నెలకు రూ.3వేలు, 400లకే గ్యాస్ సిలిండర్ను ఇవ్వనున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు బాదావత్ రవినాయక్, రెడ్డిగళ్లసమన్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బూడిద తేజస్విని శ్రీకాంత్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మ భాస్కర్రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.