సిటీబ్యూరో/సిటీ క్రిమినల్ కోర్టు, సెప్టెంబర్11(నమస్తే తెలంగాణ)/నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 16,113 కేసులకు పరిష్కారం లభించిందని, బాధితులకు రూ.1.59 కోట్ల పరిహారాన్ని చెల్లించినట్లు లీగల్ సర్వీసెస్ కార్యదర్శి రాధిక జైస్వాల్, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ తుకారాంజి తెలిపారు. ఇందులో కుటుంబ ఘర్షణ కేసులు 39, చెక్ బౌన్స్ కేసులు 286, ఎస్టీసీ 13,638, ఫ్రీలిటిగేషన్ కేసులు 1283, ఎక్సైజ్ కేసులు 243, సీసీ ఐపీసీ కేసులు 581, క్రిమినల్ కేసులు 43 వరకు ఉన్నాయని తెలిపారు.
అదే విధంగా జాతీయ లోక్ అదాలత్తో 695 సివిల్ కేసులు పరిష్కారమయ్యాయని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి డాక్టర్ శ్రీమతి సుమలత తెలిపారు. జంట నగరాలలో వివిధ న్యాయస్థానాల్లో 11 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష, వర్చువల్ పద్ధతిలో కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రమాదంలో కాలు కోల్పోయిన యువకుడికి రూ.26 లక్షల నష్ట పరిహారం చెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన మధుసూదన్కు రూ.35లక్షల నష్ట పరిహారం చెల్లించాలంటూ లోక్ అదాలత్ ఆదేశాలిచ్చింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఇందులో 6030 క్రిమినల్ కేసులు, 87 సివిల్ కేసులు, 1202 బ్యాంకు రికవరీ కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2.13 కోట్ల పరిహారం ఇప్పించినట్లు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7319 కేసులను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జి.రాధారాణి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తిరుపతి, పదమూడో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసాచారి, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్స్ బార్ ప్రెసిడెంట్ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.