అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసి, ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బుధవారం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉత్కంఠ వీడింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సాగనుంది. ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలకు 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
వివిధ కారణాలతో ఎనిమిది స్థానాలకు ఎన్నికలు నిలిచాయి. అభ్యర్థుల మృతితో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 2,058 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలు 10,047 ఉండగా.. 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 375 చోట్ల ఎన్నికలను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల మృతితో 81 చోట్ల వాయిదా పడ్డాయి. మిగతా 7,220 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా. 18,782 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.