జీడిమెట్ల, ఆగస్టు 4 : రుణం కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.1.12 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్నగర్ నివాసి ఎం.శ్రావణ్కుమార్ ప్రైవేటు ఉద్యోగి. జూలై 22న అతడు రుణం కోసం గూగుల్లో సెర్చ్ చేయగా, ఆన్లైన్ లోన్ బజార్ వెబ్సైట్ కనిపించింది. ఆ వెబ్సైట్లో తనకు రూ.3 లక్షల రుణం కావాలని పేరు, ఫోన్ నంబర్లతో దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు ఓ మహిళ ఫోన్ చేసి.. ఆన్లైన్ లోన్ బజార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పరిచయం చేసుకుంది. రుణం కోసం కావాల్సిన డాక్యుమెంట్లను వాట్సాప్లో పంపాలని సూచించింది. శ్రావణ్ కుమార్ అన్ని వివరాలు పంపించాడు. మరుసటి రోజు మీరా అనే మహిళ శ్రావణ్కు ఫోన్ చేసి.. మీ లోన్ ప్రాసెస్ నిమిత్తం రూ.5,400 చెల్లించాలి.. గూగుల్ పే ద్వారా పంపాలని సూచించింది. శ్రావణ్ వారు చెప్పిన నంబర్కు డబ్బు పంపించాడు. ఇలా పలుసార్లు శ్రావణ్కుమార్ నుంచి మొత్తం రూ.1.12 లక్షలు వసూలు చేశారు. చివరికి సైబర్ నేరాగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): కేవైసీ అప్డేట్ చేస్తామంటూ నమ్మించి వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు రూ. 5.3 లక్షలు టోకరా వేశారు. డీడీ కాలనీకి చెందిన సత్యనారాయణకు తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ బ్యాంకు ఖాతాలు బ్లాక్ అవుతాయి.. వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ సూచించారు. నిజమని నమ్మిన ఆయన వారు చెప్పినట్లు వివరాలు ఇచ్చాడు. దీంతో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును నేరగాళ్లు దోచేశారు. మరో ఘటనలో.. క్రెడ్ యాప్లో గుర్తు తెలియని వ్యక్తులు తన క్రెడిట్ కార్డుపై రూ. 1.08 లక్షల రుణం తీసుకొని మోసం చేశారంటూ సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పెట్టుబడి పేరుతో మరో వ్యక్తి రూ. 1.10 లక్షలు, గూగుల్ సెర్చ్లో ఇంకో మహిళను రూ. 1.5 లక్షలు సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.