సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): నెలకు 7 శాతం వడ్డీ ఇస్తానంటూ భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించి, మోసం చేసిన యాక్సెస్ బ్యాంకు మాజీ ఉద్యోగిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష రవిప్రోల్ గతంలో యాక్సెస్ బ్యాంకులో పనిచేశాడు. ఆ సమయంలో తాను చెప్పినట్లు డిపాజిట్లు చేస్తే నెలకు 7 శాతం వడ్డీ ఇప్పిస్తానంటూ తెలిసిన వారు, స్నేహితుల వద్ద నుంచి రూ. 6.65 కోట్లు సేకరించాడు. మొదట్లో కొన్ని నెలలు వడ్డీ ఇచ్చి, ఆ తర్వాత చేతులెత్తేశాడు. తన వద్ద నుంచి పలు వ్యాపారాల నిమిత్తం డబ్బు తీసుకున్న వారు ఇవ్వడం లేదంటూ చెబుతూ వచ్చాడు. బాధితులు ఒత్తిడి చేయడంతో చెక్కులు కూడా ఇచ్చాడు. అవి బౌన్స్ కావడంతో బాధితుడు రవిశంకర్తో పాటు మరో 15 మంది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ల వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ బేగంబజార్కు చెందిన ఓ వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ.3.48 లక్షలు టోకరా వేశారు. గోవింద్ రాము అనే వ్యక్తికి గుర్తుతెలియని వారు ఫోన్ చేయడంతో ఫోన్లు ఆర్డర్ ఇచ్చాడు. అయితే, వాళ్లు నిజమా.. కాదా.. అని తేల్చుకోవడం కోసం ఢిల్లీలో తమకు తెలిసిన వారి ద్వారా రూ.50 వేలు ముందుగా చెల్లించాడు. ఆ డబ్బుకు సరిపోయిన సెల్ఫోన్లను నేరగాళ్లు పంపించడంతో నమ్మకం కుదిరి రూ.3.5 లక్షలకు ఆర్డర్ పెట్టాడు. డబ్బు బ్యాంకులో డిపాజిట్ కాగానే నేరగాళ్లు సెల్ఫోన్లు స్విచాఫ్ చేశారు. మరో ఘటనలో తార్నాకలో నివాసముండే మెడికల్ వ్యాపారి కుమార్కు తక్కువ ధరకు సర్జికల్ గ్లౌస్లు ఇస్తామంటూ రూ.3.75 లక్షలు డిపాజిట్ చేయించుకొని మోసం చేశారు. ఇంకో ఘటనలో ఆర్సీ జైన్ అనే వ్యక్తికి హల్దిరామ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తామంటూ రూ.3.24 డిపాజిట్ చేయించుకొని చీటింగ్ చేశారు. బాధితులు బుధవారం సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.