సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : మీకు డబ్బులు అత్యవసరంగా అవసరం ఉందా.. ఎక్కడి నుంచి డబ్బులు పుట్టడం లేదా.. ఆన్లైన్ రుణ యాప్ సంస్థల నుంచి లోన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ ఆన్లైన్ రుణ యాప్లు 36 నుంచి 52శాతం వడ్డీని వసూలు చేస్తాయి. మీరు కట్టకపోతే మీ పరువును సోషల్ మీడియా వేదికగా బజారుకీడుస్తాయి. అందుకే ఆన్లైన్ రుణ యాప్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీలతో పరేషాన్ చేస్తున్న 9 ఆన్లైన్ రుణయాప్లతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ (టీ-4 సీ) సూచిస్తుంది. ఈ యాప్ లోగోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో డబ్బులు అవసరం ఉన్న వారు ఈ రుణ యాప్ల జోలికి పోకుండా ఆర్బీఐతో రిజిస్టర్ ఉన్న బ్యాంక్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ సంస్థల వద్ద నుంచి తీసుకోవాలని తెలుపుతున్నారు.
ఈ ఆన్లైన్ రుణ యాప్లు నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు చేస్తుండటంతో చాలా మంది వడ్డీ గురించి ముందుగా పట్టించుకోవడంలేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటుకున్న ఆన్లైన్ రుణయాప్లు వడ్డీలతో బాదేస్తారు. వసూలు కోసం రుణం తీసుకునే వారి ఫోన్లోని కాంటాక్ట్లు, ఫొటోలు, ఇతర వివరాలను చూసేందుకు అనుమతి కోరుతారు. రుణం మంజూరవుతుందనే ఆత్రుతతో పాటు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంస్థలు అడిగే ప్రతి అంశానికి బాధితులు అనుమతిని ఇచ్చేస్తారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని రుణం తీసుకున్న వ్యక్తి వడ్డీ చెల్లింపు లేదా రుణం చెల్లింపులో ఆలస్యమైందంటే చాలు కాంటాక్ట్లో ఉన్న వారందరికీ ఫోన్లు చేస్తారు. రుణం తీసుకున్న వ్యక్తికి మీరు షూరిటీగా ఉన్నారని.. మీరే రుణం చెల్లించాలి కోరుతారు. లేదా రుణం తీసుకున్న వ్యక్తితో తక్షణమే కట్టించాలని బెదిరింపులు మొదలు పెడతారు. అంతేకాకుండా అందరికీ తెలిసేలా వాట్సాప్లలో మెసేజ్లు పెడుతారు. గతంలో ఇదే విధంగా చైనా దేశానికి చెందిన రుణ యాప్ల ద్వారా వేధింపుల బారిన పడి కొంత మంది అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
డబ్బు అవసరం ఉన్న వారు ఆన్లైన్ రుణ యాప్ల జోలికి పోవద్దు. రుణం తీసుకుంటే మీ పరువును మీరే తీసుకునేందుకు వారికి అవకాశం ఇస్తారు. మీ కారణంగా మీ ఫోన్లో కాంటాక్ట్స్లో ఉన్న వారు కూడా ఇబ్బందులకు గురవుతారు. రిజిస్టర్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంక్ల వద్దనే రుణాలు తీసుకోండి. -హరినాథ్, ఏసీపీ, రాచకొండ సైబర్ క్రైం పీఎస్