తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 5 : విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి సాహిత్యం దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మొట్టమెదటి తెలంగాణ బాల సాహిత్య సమ్మేళనం ఆద్యాతం సాహిత్య పరిమళాలను వెదజల్లింది. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ పిల్లలకు నైతిక విలువలు, సత్ప్రవర్తన, పెద్దల పట్ల గౌరవం, మాతృభాష సంస్కృతులపై అనురక్తి వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర రచనలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
సారస్వత పరిషత్తు చేపట్టిన తొలి ప్రయత్నం గొప్పగా ఉందని ఆయన అభినందించారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మట్లాడుతూ తెలంగాణ సారస్వత పరిషత్తు 80 ఏండ్ల ఉత్సవం వచ్చే మే నెలలో జరగనున్న నేపథ్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ దాసరి వెంకటరమణ, చొక్కాపు వెంకటరమణ, డాక్టర్ పత్తిపాక మోహన్లను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, సాహితీవేత్తలు ఆచార్య ఎస్వీ రామారావు, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, శాంతా బయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి, మణికొండ వేదకుమార్, మాడభూషి లలితాదేవి, రంగినేని మోహన్రావు, డాక్టర్ విజయలక్ష్మి, గరిపెల్లి అశోక్, డాక్టర్ సిల్మానాయక్, సామలేటి లింగమూర్తి, టి.పద్మ, డాక్టర్ ఎన్.సునీత, ఉండ్రాళ్ల రాజేశం, పి. చైతన్య భారతి, డాక్టర్ వి. వింధ్యవాహినీ దేవి, డాక్టర్ వి.జయ ప్రకాశ్, బైరోజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.