ఆర్కేపురం, నవంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.3కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని 88 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్టు చేశామని సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు తెలిపారు. శనివారం ఆర్కేపురంలోని సరూర్నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సరూర్నగర్ ఎక్సైజ్ పరిధిలోని ఐదు నియోజకవర్గాలైన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్, షాద్నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ప్రకారం 24 గంటలు రెండు టీములు గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం వంటిపై నిఘా పెట్టామని, దాదాపు 84,440 లీటర్ల మద్యం, 75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందన్నారు. సుంకం చెల్లించని మద్యం, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే కమిషనర్ కార్యాలయానికి గాని, టోల్ ఫ్రీ నం.18004252523 సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, సరూర్నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్రావు, ఎక్సైజ్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 4 : బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో యాక్టివా వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.5 లక్షలు పట్టుబడ్డాయి. నగదుకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్లు చూపించి నగదును తీసుకుపోవచ్చని సీఐ భాస్కర్ తెలిపారు.