సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : కాలనీల నుంచి మెయిన్ రోడ్లకు కనెక్ట్ చేసి, ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ వాహనదారుల మన్ననలు పొందుతున్న హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) వెస్ట్కారిడార్లో మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 133 లింకు రోడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 44.65 కిలోమీటర్ల మేర కలిపి మొత్తం 37 చోట్ల పనులు చేపట్టారు.
ఇప్పటికే 23 లింకు రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 14 చోట్ల పనులు చివరి దశకు చేరాయి. ఇందులో భాగంగానే ఇటీవల రెండో విడతగా రూ. 232.62కోట్ల ఖర్చుతో 13 చోట్లకు గాను 21.98 కిలోమీటర్ల మేర లింక్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే సుమారు రూ.33.14కోట్ల అంచనా వ్యయంతో రెండు చోట్ల లింక్ రోడ్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు.
క్రాంతివనం లే అవుట్ నుంచి భాగ్యలక్ష్మి లే అవుట్ మీదుగా నార్నే రోడ్ను అనుసంధానం చేయడం ద్వారా కొండాపూర్ బొటానికల్ గార్డెన్, పాపిరెడ్డి నగర్, క్రాంతివనం కాలనీ సమీప ప్రాంతాల వాసులకు ప్రయాణం మరింత సులువు కానుంది. ఇక రెండో లింక్ రోడ్డు నల్లగండ్ల రాణాప్రతాప్ టవర్ నుంచి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ కార్యాలయం వరకు ఏర్పాటయ్యే లింక్ రోడ్డుతో గుల్మెహర్ పార్క్, అపర్ణ సైబర్ జోన్, నేతాజీ నగర్, నల్లగండ్ల లేక్ , అపర్ణ సరోవర్ వాసులకు తక్కువ సమయంలో తమ తమ గమ్యస్థానాలను చేరుకునే సౌకర్యం కలుగుతుంది. ఈనెల 21వ తేదీ వరకు టెండర్ గడువు ముగియనుందని, ఈ నెలాఖరులో మరిన్ని లింక్ రోడ్లకు టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు.