నాంపల్లి, అక్టోబర్ 19: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పసునూరు గ్రామంలో మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికలలో గెలిచిన రాజగోపాల్రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు తన స్వార్థం కోసం రాజీనామా చేసి మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నాడని ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే బోరు బావులకు మీటర్లు పెడతారని పేర్కొన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరింత విస్త్రతం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, పోగుల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు పోగుల విజయ, మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కె అబ్బాస్, జాని, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.