వనస్థలిపురం, డిసెంబర్ 28 : ఒక్కరి అవయవదానంతో 8మందికి ప్రాణం పోయవచ్చని, అవయవదానం కోసం అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం అవయవదానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ జీవన్దాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఇప్పటివరకు 1,158 మంది వద్ద అవయవాలు సేకరించి 4,057 మందికి పునర్జన్మ ఇవ్వడం జరిగిందన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచే అవయవాలు సేకరించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించి వారు ముందుకు వచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోవడం కంటే మరో ఇంటికి వెలుగునివ్వడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇప్పటికే ట్రస్టు నుంచి 150మంది దాతలు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. కుటుంబాలుగా ముందుకు వస్తున్నారని తెలిపారు. జనవరి 1న వైద్య శాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా యువత సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అవయవ దానంపై సామాజిక రుగ్మతలు, మూఢ నమ్మకాలను విశ్వసించవద్దన్నారు. జయచంద్రారెడ్డి ట్రస్టు చైర్పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్రెడ్డి, జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ భానుచందర్, రామ్ చల్లా, రమాకాంత్, రంగేశ్వరి, రోజారెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీవణ్కుమార్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్ : బాగ్ హయత్నగర్లోని హరిజనుల శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బుధవారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి బాగ్ హయత్నగర్కు చెందిన హరిజనులు వినతిపత్రం సమర్పించారు. శ్మశానవాటికలో వసతులు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. స్నానాలు చేసేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకురావల్సి వస్తుందని ఎమ్మెల్యేకు తెలిపారు. స్నానాల గదులు లేవని, బట్టలు మార్చుకోవడం ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్మశానవాటికను త్వరలో పరిశీలించి మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. పారంద స్వామి, ఎర్ర రవీందర్, ఎర్ర హరిబాబు, పి. అశోక్, పి. సత్యనారాయణ, వై. శ్రీనివాస్, కల్యాణ్, మధుబాబు, ఎస్. వెంకటేశ్ పాల్గొన్నారు.