మియాపూర్ : నాణ్యమైన ఉచిత విద్య, భోజన తదితర సేవలతో అన్ని వర్గాల విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్న సర్కారీ బడులను మరింత సౌకర్య వంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కార్పొరేట్కు దీటుగా పాఠశాలలో మౌలిక వసతులను కల్పించుకుని నియోజకవర్గంలో పాఠశాలలన్నింటినీ ఆదర్శంగా తయారు చేసుకోవాలన్నారు.
మన ఊరు మన బడి కార్యక్రమంపై మండల విద్యాశాఖాధికారి వెంకటయ్య, కార్పొరేటర్ శ్రీకాంత్ సహా ప్రధానోపాధ్యాయులతో విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా 31 పాఠశాలలను వసతుల పరంగా అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
ఇందుకు గాను తగిన నిధుల మంజూరుకు తాను ప్రభుత్వాన్ని కోరినట్లు , సానుకూలంగా స్పందన లభించిందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసి పోతున్నాయని, నాణ్యమైన బోధనతో మరింత బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఇప్పటికే ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ రంగాలలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారని విప్ గాంధీ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేయబోయే నిధులను సద్వినియోగ పరిచి పూర్తి స్థాయి వసతులను కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ వినయ్ , ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.