‘మల్కాజిగిరికి నెలకోసారి వస్తా.. మీ సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తా’ అని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓట్లతో కరిగించాలని, మర్రి రాజశేఖర్రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్ను నమ్మితే ఎండమావులను నమ్మినట్లేనని, కర్ణాటకలో లాగ ఆగమైపోతామని అన్నారు. అక్కా చెల్లెళ్లు ఆలోచించి.. ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. బుధవారం నేరేడ్మెట్ సరస్వతీ ఫంక్షన్హాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం, మల్లాపూర్లోని వీఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు రెండు నియోజకవర్గాలో గులాబీ జెండాను రెపరెపలాడించాలన్నారు.
– సిటీబ్యూరో/నేరేడ్మెట్/ఉప్పల్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)
నేరేడ్మెట్, నవంబర్ 8 : రౌడీయిజం పేరు తెచ్చుకున్న మైనంపల్లికి, మంచి పేరు ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మైనంపల్లికి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. అని మంత్రి పేర్కొన్నారు.
బుధవారం నేరేడ్మెట్ సరస్వతీ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ కే శ్రీదేవి హన్మంతరావు, జీకే హన్మంతరావు, మధుసూదన్రెడ్డి వారి అనుచరులతో కలిసి మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మల్కాజిగిరిని దత్తత తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తానని, మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలన్నారు. మైనంపల్లి నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తనకు ఆయన లాగా దిగజారుడు మాటలు మాట్లాడటం రాదన్నారు. ఈ ప్రాంత వాసుల రెగ్యులరైజ్ సమస్యను పరిష్కరించాలని దరఖాస్తులు ఇచ్చారని గుర్తు చేశారు. పదేండ్లు ఉన్న హన్మంతరావు వారి సమస్యలు పట్టించుకోలేదన్నారు. రాజశేఖర్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపిస్తే సమస్యలన్నింటిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, తాగునీరు, కరెంట్ కష్టాలు తీర్చారని స్పష్టం చేశారు. దొరల తెలంగాణ అని కాంగ్రెస్ నేత విమర్శించడాన్ని మంత్రి దుయ్యబట్టారు. కేసీఆర్లో దొరతనం లేదని, ఆయన ప్రేమ…దయాగుణంతో రాష్ర్టాన్ని పాలిస్తున్నారని అన్నారు. తలసరి అదాయం, ధాన్యం ఉత్పత్తి, ఐటీ ఉద్యోగాల కల్పన ప్రతి రంగంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా కోటి మందికి రూ.5లక్షల బీమా అమలు, గ్యాస్ సిలిండర్ రూ.400లకే అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కాంగ్రెస్ లాంటి దోపిడీ దొంగలకు కాకుండా సంపద పెంచాలి…పేదలకు పంచాలి అనే నినాదంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ సర్కారుకు మరోసారి అండగా నిలబడాలని కోరారు. ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి నాలుగేండ్లుగా మల్కాజిగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరికి చెడు పోయి.. మంచిరోజులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యేకు రూ.6కోట్లు నిధులు వచ్చాయి.. కానీ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. ఇక్కడి కార్యకర్తలు, నాయకులను భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు.
నేరేడ్మెట్ మాజీ కార్పొరేటర్ కే.శ్రీదేవి హన్మంతరావు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి జితేందర్ రెడ్డి, కార్పొరేటర్లు మీనా ఉపేందర్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, జవహార్నగర్ కార్పొరేటర్ మురుగేశ్, అంజయ్య, పరశురాంరెడ్డి, వెంకన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.