ఎల్బీనగర్, జనవరి 28 : ఎల్బీనగర్ జంక్షన్ను సిగ్నల్ ఫ్రీగా మారుస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీనగర్లోని చింతలకుంట నుంచి ఎల్బీనగర్ మహాల్ మైసమ్మ దేవాలయం వరకు నిర్మించిన ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్బీనగర్ జంక్షన్ ఇన్నర్ రింగ్రోడ్డులో రెండు అండర్పాస్ల నిర్మాణంతో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయని, ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్ పూర్తి కావడంతో ప్రయాణాలు సాగుతున్నాయని, ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, దీంతో ఈ జంక్షన్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాగుతుందన్నారు. మొత్తంగా ఎల్బీనగర్ జంక్షన్లో రూ.120 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మాణం చేశామన్నారు. కుడివైపు ఫ్లై ఓవర్ నుంచి వాహనాలు దిగే ప్రాంతమైన మహాల్ మైసమ్మ దేవాలయం వద్ద వేగాన్ని అదుపు చేసేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ కుడి ఫ్లై ఓవర్ త్వరలోనే రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. నిత్యం ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెడుతూ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఎల్బీనగర్ జంక్షన్తో పాటు నగర వ్యాప్తంగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు సాగర్ తదితరులు పాల్గొన్నారు.