ఖైరతాబాద్, ఏప్రిల్ 26 : మాల్కాజిగిరి ఎమ్మెల్యే భూ కబ్జాలు చేశారంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేస్తూ అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని శ్రీ వేంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, విజయ్ ఎన్ రాజ్లతో కలిసి మాట్లాడారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అల్వాల్లోని పాకాలకుంట్ల (జొన్నబండ) గ్రామంలో సర్వే నం.575 నుంచి 589 వరకు ఉన్న 150 ఎకరాల భూమిలో 25 ఎకరాల భూమిని 1996లో స్థానికులమైన మేము సుమారు 367 ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు.
2005లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అర్బన్ సీలింగ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసిందని, దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరం కలిసి ప్రభుత్వానికి డీడీలు చెల్లించి యూఎల్సీ, ఎండార్స్మెంట్ సర్టిఫికెట్ల ద్వారా ఆ ప్లాట్లను తిరిగి సొంతం చేసుకున్నామని, 2010లో ఎల్ఆర్ఎస్ సైతం లభించిందన్నారు. 2020లో హజీజ్ జిలానీ అనే వ్యక్తి వచ్చి ఈ ప్లాట్లు ఉన్న స్థలం తమ పూర్వికులదని, స్వాధీనం చేసుకుంటామంటూ దౌర్జన్యానికి దిగాడన్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి తమ పక్షాన నిలబడి కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారన్నారు. దీంతో కక్ష గట్టిన హజీజ్ జిలానీ అతడి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ప్లాట్లు కబ్జా చేస్తున్నాడంటూ చానెళ్లలో తప్పుడు వీడియోలు వైరల్ చేశారన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రణయ్, సభ్యులు వీర ప్రకాశ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.