మేడ్చల్, జూలై 1: విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ శనివారం ప్రిన్సిపాల్ రామస్వామి రెడ్డి ఆధ్వర్యంలో స్నాతకోత్సవం, పూర్వ విద్యార్థి దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరిన మొదటి ఏడాదే సరియైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ లక్ష్యం దిశగా క్షణం వృథాగా చేయకుండా శ్రమించాలన్నారు. పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ఎంచుకున్న రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ అవకాశాలను వినియోగించుకోవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఉద్యోగం సాధించడంతో సరిపెట్టడం కాకుండా పది మందికి ఉపాధి చూపించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. గౌరవ అతిథులుగా హాజరైన అంతర్జాతీయ మానవ వనరుల విభాగ సంచాలకుడు విజయ్, ఈ పామ్ సిస్టమ్స్ వనరుల అభివృద్ధి అధికారి ఇమ్మాన్యూయేల్, సిలికాన్ లాబ్స్ విశ్వ విద్యాలయ వ్యవహారాల అధికారి సుబ్రహ్మణియన్, కాగ్నిజెంట్ మానవ వనరుల అధికారి జితేంద్రసింగ్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఉండగానే విద్యార్థులు అన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. భావి జీవితంలో అన్ని సవాళ్లను ఆత్మైస్థెర్యంతో ఎదుర్కొని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో ఎంజేసీ ప్రసాద్, పీఆఎస్ఆర్ మూర్తి, చంద్రహాస్, చంద్రమౌలి సమన్వయకర్తలుగా వ్యవహరించగా హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అసోసియేషన్ కౌన్సిల్ సోషల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.