హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : దేశంలో కార్మికులకు కనీస వేతనాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. కార్మికులకు భద్రత, వారి బతుదెరువుకు భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని, అందుకే 15 రాష్ర్టాల నుంచి దాదాపు 25 లక్షల మంది కార్మికులు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. గురువారం చిక్కడపల్లిలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశానికి తెలంగాణ మాడల్ అవసరమన్నారు. అనంతరం కనీస వేతనాల సలహా మండలి చైర్మన్తోపాటు సభ్యులు మంచె నర్సింహులు, పి.నర్సయ్య, కటకం చేతన్, దుర్గాప్రసాద్, నిరంజన్రావు, శివశంకర్, శంకర్రెడ్డి, మల్లికార్జున్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, నాయకులు వేముల మారయ్య, కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పులిమామిడి నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికవర్గ సమస్యల పట్ల సీఎం కేసీఆర్కు ఎంతో అవగాహన ఉన్నదన్నారు. పారిశుద్ధ్య కార్మికులతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారికి జీవన భద్రతను కల్పించి, కనీస వేతనాలను అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ శ్రమ ఫలితంగా తెలంగాణకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ అటు యజమానులు, ఇటు కార్మికుల భవితకు భరోసా కల్పించారని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కుల, మతాల పేరిట కలహాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. భారత కార్మిక రంగానికి సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలస్తున్నారని అన్నారు. ఇతర రాష్ర్టాల్లోని కార్మికుల కంటే తెలంగాణలోని కార్మికుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ముషీరాబాద్, తాండూరు, ఉప్పల్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పైలట్ రోహిత్రెడ్డి, బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, సీపీఎం నేత రాములు, బీఆర్ఎస్కేవీ నేత వేముల మారయ్య, యువపారిశ్రామికవేత్త యనమల రాజు తదితరులు పాల్గొన్నారు.