హిమాయత్నగర్, జూలై 16 : రాష్ట్రంలోని పద్మశాలీలకు, చేనేత వర్గానికి అండగా ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి ఎల్.రమణ అన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా అఖిల భారత పద్మశాలి మహిళా సంఘం, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణగూడలోని పద్మశాలి భవన్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పద్మశాలీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని, మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి మహిళ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుశ్యంతల, రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప, గ్రేటర్ అధ్యక్షురాలు శారద, నాయకులు మ్యాడం బాబురావు, శ్రీధర్, పుట్ట పాండురంగయ్య, వెంకన్న, మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.