బాలానగర్ , మే 4: మల్కాజిగిరిలో లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఫతేనగర్ డివిజన్లో చేపట్టిన రోడ్ షోకు జనం శనివారం నీరాజనాలు పలికారు. ఫతేనగర్లో వాడవాడలా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. వేలాది మంది గులాబీ శ్రేణులు గులాబీ కండువాలు భుజాన వేసుకొని జై కేసీఆర్, జైజై కేసీఆర్, జై ఎంకేఆర్, జైజై ఎంకేఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీజే పాటలతో ఫతేనగర్ పులకించి పోయింది.
బీఆర్ఎస్ శ్రేణులు ఆటపాటలలో మునిగి తేలారు. ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి భార్య రజినీరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ఆడపడుచులు డీజే పాటలతో స్టెప్పులేశారు. వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ముందు నడువగా నేతలు ఎన్నికల ప్రచార రథంలో నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యుత్ సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతరేస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుతాడి రాములు, బిక్షపతి, సుదర్శన్ రెడ్డి, కరుణాకర్, కిరణ్, సురేశ్ నాయుడు, సురేందర్ నాయుడు, పురుషోత్తం, శిల్ప, కృష్ణకుమారి, ఉమావతి గౌడ్లతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.