సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : మాసబ్ ట్యాంకులో ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబసభ్యులను శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో కీలకపాత్ర పోషించే న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం అత్యంత విచారకరమన్నారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన..
ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ
జరిపించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేయాలని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని సాయికిరణ్ యాదవ్తోపాటు పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు.