హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వాసులకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాడి మసైపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నన్నా.. ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలకు తీసేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కార్.. ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం వారి మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి.. తీరని నష్టాన్ని కలిగించారు అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో.. రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేని రాజధాని వాసులకు మళ్లీ కరెంట్ కష్టాలను పరిచయం చేసిన పాపం సైతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిదే అని కేటీఆర్ ఆగ్రహించారు. ఒక వైపు అస్థవ్యస్తంగా మారిన డ్రైనేజీ, మరో వైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో నగరవాసులు అనేక ఇబ్బందులు పడుతుంటే.. ఉచిత నీటి పథకానికి కూడా గండి కొట్టాలని చూస్తున్న రేవంత్రెడ్డికి.. కర్రు కాల్చి వాత పెట్టేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.