అంబర్పేట, నవంబర్ 8 : ఓడిపోతానన్న భయంతోనే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం లేదని, అస్త్ర సన్యాసం తీసుకున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. వాళ్ల పార్టీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి నందునే ఆయన పోటీ చేయడం లేదని చెప్పడం… కిషన్రెడ్డి బీసీలను కించ పరిచినట్లేనని ధ్వజమెత్తారు. అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తరపున బాగ్అంబర్పేట డివిజన్ గజానంద్గడ్డ, పాములబస్తీ, పోచమ్మబస్తీ తదితర ప్రాంతాలలో కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి, ఎన్నికల ఇన్చార్జి గండ్ర మోహన్రావులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను వివరించి కాలేరు వెంకటేశ్ను గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… 2018లో ఓడిపోయి అదృష్టం కలిసొచ్చి కేంద్రమంత్రి అయ్యారని, అయినా ఇప్పటి వరకు సికింద్రాబాద్ పార్లమెంట్లో కానీ, అంబర్పేట నియోజకవర్గ పరిధిలో కానీ ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.
రెండు సీట్లు గెలిచే బీజేపీ… బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో 40 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నంతకాలం పదవుల కోసం సొంత పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలకే పరిమితమై అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలంటూ ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నా రు. కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి హ్యాట్రిక్ సాధించబోతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముషీరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్ను ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పదేండ్లుగా నగరానికి నిరంతరాయంగా మంచినీరు, విద్యుత్ సరఫరా అందించడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్లోని పలు బస్తీల్లో మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష, నిత్యం జనం మధ్య ఉండే ముఠా గోపాల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బస్తీల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను గమనించి ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని సూచించారు. మోసపూరిత వాగ్దానాలతో మరోమారు ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ముషీరాబాద్లో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, హరిబాబు యాదవ్, ముఠా జయసింహ, టి.సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.