ప్లాస్మా ఫెరిసిస్’ సహాయంతో మార్గం సుగమం
ఇద్దరి బ్లడ్ గ్రూపులు కలువకున్నా.. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన కిమ్స్ వైద్య బృందం
బేగంపేట్, ఏప్రిల్ 25 : కిమ్స్ వైద్యులు అరుదైన వైద్యం నిర్వహించారు. వేర్వేరు బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించి రోగికి పునర్జన్మను ప్రసాదించారు. ఆదివారం కిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంటేషన్ ఫిజీషియన్ డాక్టర్ రవి వివరాలు వెల్లడించారు. అసోంకు చెందిన ఆసిమ్దాస్ (40)కు జన్యుపరమైన సమస్యలతో కిడ్నీలు పాడయ్యాయి. రెండేండ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నాడు. డయాలసిస్లో సమస్యలు వస్తుండటంతో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రత్యామ్నాయమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాని ఇద్దరి బ్లడ్ గ్రూపులు కలువలేదు. అయినప్పటికీ కిమ్స్ వైద్యులు ఆసిమ్దాస్ భార్య కిడ్నీ తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు సిద్ధయ్యారు.
ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతిబంధకంగా మారే రెసిస్ట్ చేసే యాంటీ బాడీస్ రోగిలో ఉండకూడదని నిర్ధారించారు. నెఫ్రాలజిస్ట్ హిమదీప్తితో కలిసి ప్లాస్మా ఫెరిసిస్ అనే ప్రక్రియ ద్వారా రోగిలో ఉన్న యాంటీబాడీస్ను క్రమంగా తగ్గించారు. ఈ ప్రక్రియకు రెండు వారాలు సమయం పట్టినట్లు తెలిపారు. అనంతరం కిమ్స్ దవాఖాన చీఫ్ సర్జన్ డాక్టర్ శర్బేష్ సహరియా ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆసిమ్దాస్కు పునర్జన్మను ప్రసాదించారు. అయితే అవయవ దాతలు ఉన్నా.. బ్లడ్ గ్రూపులు కలువక పోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితుల్లో తాము సాధించిన ఈ విజయం భవిష్యత్లో ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టనున్నదని వైద్యులు తెలిపారు.