రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను(15) మద్యం మత్తులో కిడ్నాప్నకు యత్నించిన నిందితుడు మండలి శ్రీకాంత్(28)కు ఐదేండ్ల జైలు శిక్ష, రూ. 20వేల జరిమానా విధించడంతోపాటు బాలిక కుటుంబానికి రూ.రెండు లక్షల పరిహారం అందించాలని ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో న్యాయమూర్తి శ్రీమతి హరీష తీర్పునిచ్చారు. ప్రత్యేక పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. గుంతపల్లి గ్రామానికి చెందిన బాలిక మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.
2017, జనవరి 4వ తేదీ సాయంత్రం బాలిక స్కూల్ నుంచి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నిందితులు పలపాటి రమేశ్, మండలి శ్రీకాంత్ మద్యం సేవించి బాలికను మార్గం మధ్యలో అడ్డగించారు. బాలికను వారి కారులో తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా.. అరవడంతో మధ్యలోనే విడిచిపెట్టారు. గమనించిన స్థానికులు వెంటపడి నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నేరనిరూపణ కావడంతో రెండో ముద్దాయి శ్రీకాంత్కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు విచారణ దశలో ఉండగానే మొదటి ముద్దాయి చనిపోయాడు.