మారేడ్పల్లి, డిసెంబర్ 24: కిడ్నాప్నకు గురైన బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ చందనాదీప్తి, అదనపు డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట ప్రాంతానికి చెందిన నారోజు రామచారి అలియాస్ రాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓల్డ్ బోయిగూడలోని విజయ వైష్టవి మెస్లో రెండు రోజులుగా పని చేస్తున్న రామచారి… అదే భవనంలోని మూడో అంతస్తులో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక కృతికను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు రేణుక, నర్సింగరావు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. సిద్దిపేట పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు దూల్మిట్టలో ఉన్నట్లు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చెవి రింగులు రూ .2 వేలకు విక్రయించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ కూతురు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో బాలిక తల్లిదండ్రులు శనివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.