ఖైరతాబాద్, సెప్టెంబర్ 19 : ఖైరతాబాద్ దశ మహా విద్యా గణపతికి నియోజకవర్గానికి చెందిన పద్మశాలి సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా తయారు చేయించిన 75 అడుగుల భారీ నూలు కండువా, 75 అడుగుల నూలు జంధ్యం, 75 అడుగుల గరికమాల, పట్టువస్ర్తాలను సమర్పించారు. తొలుత వీటికి లోయర్ ట్యాంకుబండ్లోని విజయ గణపతి ఆలయం, సచివాలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రాజ్దూత్ హోటల్ చౌరస్తా నుంచి గుర్రపు బగ్గీలో స్వామివారికి సమర్పించే పట్టువస్ర్తాలను ఊరేగించారు. ఈ శోభాయాత్ర ఒగ్గుడోలు విన్యాసాలు, కోలాటాలు, వందలాది భక్తుల గణపతి నామస్మరణల మధ్య వైభవంగా సాగింది. అనంతరం ఖైరతాబాద్ దశ మహా విద్యా గణపతికి ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మహాగణపతికి 75 అడుగుల జంధ్యాన్ని సమర్పించారు. కండువాను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, గరికమాలను ఐఏఎస్ అధికారి వెంకటేశ్ సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్ భారీ లడ్డూను, కరెన్సీ మాలను సమర్పించగా, రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి ముత్యాల అభిషేకం చేయించారు. అలాగే మహాగణపతి చెంతనే కొలువుదీరిన వారాహి అమ్మవారికి హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ పట్టువస్ర్తాలను అందజేశారు. సరస్వతి మాతకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ పట్టువస్ర్తాలను సమర్పించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ లక్ష్మీనరసింహ స్వామి, వీరభద్రస్వామి వారికి జంధ్యం, కండువాలను సమర్పించారు.