ఎల్బీనగర్, జూలై 30 : క్యూబా దేశానికి అండగా నిలువడం ప్రపంచ మానవుల కర్తవ్యమని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చైతన్యపురిలో కాచం సత్యనారాయణ అధ్యక్షత జరిగిన క్యూబా సంఘీభావ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్టా శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. సోషలిస్టు ప్రభుత్వాలను కూలదోసే క్రమంలో అమెరికా క్యూబా మీద ఆంక్షలను విధిస్తూ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తోందని విమర్శించారు. అమెరికా ప్రపంచంలో పెద్దన్న పాత్రను పోషిస్తూ ఆయుధ వ్యాపారం నిర్వహిస్తోందన్నారు.
ఏఐపీఎస్ఓ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో తమ సంస్థ క్యూబాకు సంఘీభావంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఐపీఎస్ఓ సంస్థ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, ప్రధాన కార్యదర్శులు కాచం సత్యనారాయణ, నాగేశ్వర్రావు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, నాయకులు పల్లె వినయ్కుమార్, కనకమామిడి శ్రీశైలంగౌడ్, రవికిశోర్, వహీద్, ఖలీల్, శ్రీధర్, రామచంద్రారెడ్డి, రమేశ్ , పాండురంగాచారి, డాక్టర్ శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు.