ధ్యానంతో మానసిక ప్రశాంతత
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
నందిగామ మండలం కన్హలో
12 పడకల కన్హ మెడికల్ సెంటర్ ప్రారంభం
నందిగామ, ఏప్రిల్ 24: విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల కన్హ మెడికల్ సెంటర్ను మంత్రి హరీశ్రావు ఆదివారం శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ గురూజీ కమలేశ్ డీ పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు 24 గంటలు ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించేందుకు కన్హశాంతి వనంలో అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలతో కన్హ మెడికల్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు కన్హ మెడికల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కన్హ మెడికల్ సెంటర్కు ప్రభుత్వం తరుఫున అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా కన్హశాంతి వనంలో మూడు లక్షలకు పైగా మొక్కలు నాటడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం మన రాష్ట్రంలో ఉండటం మన ప్రాంతం అదృష్టమని పేర్కొన్నారు. నేడు ఉరుకులు పరుగుల జీవితంగా మనుషులు ప్రశాంతత కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారని, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకుని ప్రతి రోజు ధ్యానం, యోగా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కోల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, కేశంపేట ఎంపీపీ వై.రవీందర్యాదవ్, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, కన్హ గ్రామ సర్పంచ్ సరిత, హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.