జవహర్నగర్, జనవరి 2: ఒకప్పుడు పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే బాధ వర్ణణాతీతం. నేడు ఆ రోజులు మారాయి. పేద కుటుంబాలు పడే బాధలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెళ్లి చేసేటప్పుడు ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దనే… ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఈ పథకాలతో తమ బిడ్డల పెళ్లిళ్లు చేసిన నిరుపేద కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. స్వరాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 2021 సంవత్సరంలో మార్చి తరువాత నుంచి అక్టోబర్ వరకు 432 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.44 కోట్లు పంపిణీ చేశారు. జవహర్నగర్ పరిధిలో….కల్యాణలక్ష్మి, శాదీముబారక్ పథకాల ద్వారా అందజేసిన సాయం సంవత్సరాల వారీగా…
పెరిగిన సాయంతో మరింత ఆసరా…
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం 2016లో ప్రారంభం కాగా తెలంగాణ ప్రభుత్వం తొలుత రూ. 51వేలు ఆర్థిక సాయం అందించింది. 2017-18లో రూ. 51వేల సాయాన్ని రూ. 75,116కు పెంచింది. నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చులు పెరిగినందున 2018 మార్చిలో రూ. 1,00, 116 పెంచి పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. కులాలు, మతాలకతీతంగా ఈ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా పాలిట దేవుడు కేసీఆర్
మాది పేద కుటుంబం, రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఉండే. మా బిడ్డ పెండ్లి చేసిన తరువాత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసినం. ప్రభుత్వం లక్షా నూటపదహారు రూపాయల చెక్కు అందజేసింది. అప్పులు చేయకుండా మా బిడ్డ పెండ్లి సాఫీగా అయ్యింది. సీఎం కేసీఆర్ సార్కు ఎప్పటికి రుణపడి ఉంటాం.
-ఇరుగదిండ్ల భాస్కర్, బీజేఆర్నగర్
మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తాం…
తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా పెండ్లి చేసుకున్న దంపతులకు రూ. 1,00,116లను మంజూరు చేస్తున్నది. 2020 – 21 సంవత్సరంలో 515 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాం. మిగిలిన దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే చెక్కులు పంపిణీ చేస్తాం. -రవి, ఆర్డీవో, కీసర