మణికొండ, మే 16: సినీ కార్మికులతో పాటు ఆపదలో ఉన్న వారికి ఏదోరూపంలో సాయమందిస్తున్న హాస్యనటుడు కాదంబరి కిరణ్.. కరోనా బాధితులకు ఉచితంగా భోజనం, మందులు, ఇతర వస్తువులు అందజేస్తూ ఉదారత చాటుకుంటున్నారు. చిత్రపురికాలనీలో కాదంబరి ఫౌండేషన్ను స్థాపించిన ఆయన మనం సైతం స్వచ్ఛంద సంస్థ, తన సహచరమిత్రుల సహకారంతో కరోనా బాధితులకు ఉచితంగా భోజన వసతి కల్పించడంతో పాటు మందులు, పీపీఈ కిట్, మాస్కులు, శానిటైజర్లు, ఇమ్యూనిటీ పెంచే పొడి, ఆక్సీమీటర్లను అందజేస్తున్నారు. అంతేకాదు కాలనీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలోని బాధితులకు పౌష్టికాహారం పెడుతున్నారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్యే అధికమని, అధైర్యపడి చాలామంది ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని కాదంబరి అన్నారు. తన సహచరులు వల్లభనేని అనిల్కుమార్, రుద్రరాజు రమేశ్ బృందం సహకారం మరువలేనిదని చెప్పారు.