బంజారాహిల్స్, జూలై 25: జూబ్లీహిల్స్లో రూ.7కోట్ల విలువైన స్థలాన్ని తక్కువధరకు కట్టబెట్టారంటూ సొసైటీ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్, కోశాధికారి నాగరాజుపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78, ఫేజ్-3లో పార్వతీదేవికి చెందిన ప్లాట్ నంబర్ 254ను ఆనుకుని సుమారు 365 గజాల ఖాళీ స్థలం ఉంది. దీనిని కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ.. ఆమోదం లేకుండానే పార్వతీదేవికి రూ.45వేలకు గజం చొప్పున అధ్యక్షుడు రవీంద్రనాథ్, కోశాధికారి నాగరాజు కేటాయించారు.
రూ.7కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని కేవలం రూ.1.65 కోట్లకే కేటాయించి భారీ మోసానికి పాల్పడ్డారంటూ సొసైటీకి చెందిన సభ్యుడు ఎం.సురేశ్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొసైటీ నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే.. ప్లాట్గా తయారు చేసి, ఇప్పటికీ వెయిటింగ్లో ఉన్న సుమారు 1500మంది సభ్యుల్లో సీనియార్టీ ప్రాతిపదికన కేటాయించాల్సి ఉంటుందని, నిబంధనలు పట్టించుకోకుండా ఈ స్థలాన్ని పార్వతీదేవికి కేటాయించడం ద్వారా సొసైటీకి రూ.5కోట్ల మేర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. ఈ స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసిందని, ఖరీదైన స్థలాన్ని తక్కువ ధరకు కేటాయించిన అధ్యక్షుడు, కోశాధికారిపై కేసు నమోదు చేయాలంటూ పేర్కొన్నాడు. ఈ మేరకు వారిపై ఐపీసీ 406, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.