సిటీబ్యూరో, జనవరి 13(నమస్తే తెలంగాణ) : ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీతో పాటు దూరభారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. హెచ్ఆర్డీసీఎల్ కింద దశల వారీగా వీటిని అందుబాటులోకి తెస్తున్నది. ఇందులోభాగంగానే జూబ్లీహిల్స్ రోడ్ నం. 5 నుంచి కేబీఆర్ పార్కు రహదారిని కలుపుతూ రూ. 2.50 కోట్లతో చేపట్టిన లింకు రోడ్డు పనుల్లో కీలక ఘట్టం పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉన్న గుట్టను పూర్తిగా తొలిచారు. దీని మధ్య నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.2ను కలుపుతూ లింకు రోడ్డును నిర్మిస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేసి..అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంతో యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. దాదాపు 5 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గుతుంది.
ప్రధానమైన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, రోడ్ల మధ్య చక్కని సంబంధం(కనెక్టివిటీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున మిస్సింగ్ లింకులు, స్లిప్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. అత్యంత దగ్గరి దారిలో తమ గమ్యం చేరేందుకుగానూ ప్రయాణికులకు సహాయ పడాలన్నదే ఈ లింకు రోడ్ల ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకుగానూ హైదరాబాద్ రోడ్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. మూడు దశల్లో 137 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన హెచ్ఆర్డీసీఎల్.. తొలి విడతలో 24 కిలోమీటర్ల మేరలో 21 రోడ్లను చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం రూ.275 కోట్ల మేర ఖర్చు చేసింది. రెండో విడతలో రూ.215 కోట్లతో 20 కిలోమీటర్ల మేర 11 చోట్ల పనులను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగానే యూసుఫ్గూడ చెక్పోస్టు రోడ్డు(జూబ్లీహిల్స్ రోడ్ నం.5), కేబీఆర్ పార్కు రోడ్డు (బంజారాహిల్స్ రోడ్డు నం.2) కలుపుతూ చేపడుతున్న లింకు రోడ్డు పనుల్లో కీలక ఘట్టం పూర్తి చేసుకున్నది. అన్నపూర్ణ స్టూడియో వద్దనున్న గుట్టను పూర్తిగా తొలిచారు. ఈ గుట్ట మధ్య నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.2ను కలుపుతూ లింకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 400 మీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు 250 మీటర్ల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రూ.2.50 కోట్లతో పనులు చేపట్టారు. వచ్చే నెలాఖరులోగా ఈ లింకు రోడ్డు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ లింకు రోడ్డుతో యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీలతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు మహా ఉపశమనం లభించనున్నది. దాదాపు 5 కిలోమీటర్ల దూరభారం తగ్గనున్నది.