హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన వివాదాస్పదమైన కేసులపై సీఐడీ విచారణ జరుపుతోంది. వెస్ట్జోన్ పరిధిలోని ఈ రెండు పోలీస్స్టేషన్లలో సివిల్ వివాదాలకు సంబంధించినవి అయినా.. కొందరు స్థానిక పోలీసులతో ఉన్న సంబంధాలను ఉపయోగిస్తూ వాటిని క్రిమినల్ కేసులుగా మార్చి కేసులు నమోదు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో.. ఈ విషయాన్ని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసముండే ఓ వ్యాపారి వివాదాస్పదుడిగా పేరుగాంచాడు. వ్యాపారాల్లో పెట్టుబడులంటూ స్నేహం చేయడం.. ఆ తరువాత ఆ విషయాన్ని వివాదం చేసి, దానిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లడం చేస్తుంటాడు. పోలీసులు తమ వాళ్లే కావడంతో వెంటనే సదరు వ్యాపారి ఇచ్చే ఫిర్యాదుపై కేసులు నమోదు చేసేవారని ఆరోపణలున్నాయి. ఇదే వివాదాస్పదుడైన వ్యాపారి.. సివిల్ విషయాలకు సంబంధించిన కేసులను తనకు ఉన్న పరిచయాలతో వాటిని క్రిమినల్ కేసులుగా నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా కొన్ని విషయాలు మాత్రం వెలుగులోకి వచ్చాయి.
సివిల్ విషయాలను క్రిమినల్ కేసులుగా మార్చి.. సెటిల్మెంట్లు చేస్తున్నారనే విషయాన్ని ఓ బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఈ విషయంపై ఆరా తీయాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు.. ఆ ఆరోపణలపై స్పష్టత రావాలంటే థర్డ్పార్టీతో విచారణ జరిపించాలని సీపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సందేహాస్పదమైన కేసుల దర్యాప్తును సీఐడీకి ఇవ్వాలం టూ గత నెల 16న వెస్ట్జోన్ డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు.
బంజారాహిల్స్లో నమోదైన 366/2020, 768/2017, జూబ్లీహిల్స్లో నమోదైన 291/2020, 640/2019, 420/2019 కేసులకు సంబంధించిన సీడీ ఫైల్స్ను సీఐడీ డీఎస్పీ టీఎస్ ఉమామహేశ్వర్రావుకు అప్పగించాలని ఆదేశించారు. అయితే.. గత నెల 16న సీపీ ఆదేశాలిచ్చినా స్థానిక పోలీసులు తర్జన భర్జన పడుతుండటంతో తాజాగా సీపీ ఈ విషయంపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న ఎస్సైలు ఆయా కేసులకు సంబంధించిన సీడీ ఫైల్స్ను సీఐడీ డీఎస్పీకి అప్పగించినట్లు తెలిసింది.