Jubilee Hills | తెలంగాణ ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిని సాధించింది. ఎస్పీఆర్ హిల్స్లో రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ రిజర్వాయర్ పూర్తయితే 24 గంటల పాటు తాగునీటికి ఇబ్బంది ఉండదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రహ్మత్నగర్లో దళిత్ స్టడీ సెంటర్ను నిర్మించారు. రూ.178 కోట్లతో కాలనీలు, బస్తీల్లో కొత్త రోడ్లు వేశారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లోనే జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు నివాసం ఉండే ప్రాంతం అనుకుంటారు. కానీ, ఈ నియోజకవర్గంలో 90 శాతం పేదలుంటారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని షేక్పేట, రహ్మత్నగర్, యూసుఫ్గూడ, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లతో పాటు సోమాజిగూడ డివిజన్లోని కొన్ని ప్రాంతాలను కలిపి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడంతో మూడోసారీ తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పదేండ్ల క్రితం అనేక సమస్యలు రాజ్యమేలేవి. ముఖ్యంగా ఇరుకైన రోడ్లు, మంచినీటి కొరత, డ్రైనేజీ సమస్య, అభివృద్ధికి నోచుకోని పార్కులు, కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. సమైక్య పాలనలో నిధుల లేమితో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించే అవకాశం లేకపోవడంతో ప్రజల కష్టాలను పాలకులు గాలికి వదిలేశారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక అభివృద్ధ్ది పనులు పూర్తి చేయగా, మరికొన్ని పనులు తుది దశలో ఉన్నాయి. అనేక బస్తీల్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం కొత్త లైన్లు వేశారు. ఎస్పీఆర్ హిల్స్లో రూ.11 కోట్లతో చేపట్టిన భారీ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.30 కోట్లతో రహ్మత్నగర్లో దళిత్ స్టడీ సెంటర్ను నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది.
నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లలో ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల్లో కొత్త రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతుల కోసం సుమారు రూ.178 కోట్లు ఖర్చు చేశారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.152 కోట్ల నిధులను ఖర్చు చేశారు. రహ్మత్నగర్ డివిజన్.. ఎస్పీఆర్ హిల్స్లో సుమారు 4 ఎకరాల క్వారీ స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించి రూ.4 కోట్లతో క్రీడా మైదానంగా తీర్చిదిద్దారు.
… బండారు మల్లికార్జున్రెడ్డి