J Santosh kumar | తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ మ్యాచ్లలో బీసీసీఐ అమలు చేసిన ‘గ్రీన్ డాట్ బాల్’ తరహాలో, రాష్ట్రంలో ఏకంగా ‘గ్రీన్ క్రికెట్’ ను తీసుకురావాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ వ్యవస్థాపకుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మెన్, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిపాదన చేశారు. ఈ మేరకు జూన్ 28, 2026 (అదివారం ) ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎం. జీవన్ రెడ్డికి అధికారిక లేఖ రాశారు.
బౌండరీల మోత.. పచ్చదనపు కోత కాకుండా..
ఈ ప్రతిపాదన ప్రకారం.. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ స్టేట్ ప్రీమియర్ లీగ్, తెలంగాణ గోల్డ్ కప్ లాంటి టోర్నీలలో కేవలం డాట్ బాల్స్కే పరిమితం కాకుండా.. నమోదయ్యే ప్రతీ డాట్ బాల్, ఫోర్, సిక్సర్లకు మొక్కలు నాటుతారు. బౌలర్ వేసే ప్రతి డాట్ బాల్ క్రమశిక్షణకు ప్రతీకగా, బ్యాటర్ బాదే ప్రతి బౌండరీ ప్రకృతికి బహుమతిగా మారాలని సంతోష్ కుమార్ ఆకాంక్షించారు. ఇటీవల లండన్లో జరిగిన క్లైమేట్ యాక్షన్ వీక్ లో “ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్” అనే కాన్సెప్ట్కు ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటేరియన్ల నుంచి వచ్చిన విశేష స్పందనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే 6.4 లక్షల మొక్కలు నాటిన బీసీసీఐ
బీసీసీఐ, టాటా గ్రూప్ సంయుక్తంగా ప్రారంభించిన గ్రీన్ డాట్ బాల్ కార్యక్రమంలో భాగంగా ఐపీఎల్లో ప్రతీ డాట్ బాల్కు మొక్కలను నాటుతున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు 6.4 లక్షల మొక్కలు నాటారు.
జియో ట్యాగింగ్తో పూర్తి పారదర్శకత..
కేవలం మొక్కలు నాటడమే కాదు, వాటికి జియో ట్యాగింగ్ చేసి, కచ్చితమైన జీపీఎస్ కోఆర్డినేట్స్తో ఎవరైనా ట్రాక్ చేసేలా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. పైగా నాటిన ప్రతి మొక్కను 1,000 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను కూడా తీసుకుంటారు. అఫీషియల్ స్కోర్కార్డ్ ఆధారంగా మొక్కల సంఖ్యను పారదర్శకంగా లెక్కించనున్నారు.
ఈ లెక్కన ఒక టీ20 మ్యాచ్ జరిగితే కనీసం వందలకొద్దీ వెరిఫైడ్ మొక్కలు నాటే అవకాశం ఉంది. ఈ చొరవతో తెలంగాణలోని 33 జిల్లాల్లో ఏటా లక్షకు పైగా మొక్కలు నాటి, పచ్చదనాన్ని మరింత పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే తొలిసారిగా..
ప్రపంచంలోనే క్రికెట్ను పర్యావరణంతో అనుసంధానం చేస్తూ ఇలాంటి జియో-ట్యాగ్డ్ క్లైమేట్ యాక్షన్ చేపట్టడం ఇదే తొలిసారి అవుతుందని లేఖలో వివరించారు. ఈ భాగస్వామ్యం కోసం త్వరలోనే ఒక అధికారిక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్సీఏ పాలక మండలిని సంతోష్ కుమార్ కోరారు. ఈ ‘గ్రీన్ క్రికెట్’ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాల్చితే, రాష్ట్ర యువ క్రికెటర్లు కేవలం క్రీడాకారులుగానే కాకుండా, పర్యావరణ రక్షకులుగా కూడా ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకుంటారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఒక దశాబ్ధ కాలంలో అటవీ విస్తీర్ణం 21 నుంచి 28 శాతానికి పెరిగింది.
Cricket has the power to unite millions. Imagine if every ball could also heal our planet.
Today, through the Green India Challenge, I have written to the Hyderabad Cricket Association proposing #GreenCricket a first-of-its-kind initiative to make TG20 the world’s first fully… pic.twitter.com/rcFoUTxQQq
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 28, 2026
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!