సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ నార్త్ జోన్ సిటీ పోలీస్ల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్లో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. 3వేల ఉద్యోగాల కల్పనకు 25 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో 1,046 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 544 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి జాబ్ మేళాలోనే పలువురికి నియామక పత్రాలను అందజేశారు.
వివిధ కంపెనీలు..
అడ్రాయిట్ నియో టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏరో క్లబ్ ఉడ్ల్యాండ్, ఆల్ట్రస్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్, రీలియన్స్ జియో, టీఎంఐ గ్రూప్, విప్రో టెక్నాలజీస్, క్సియోమీ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత పెద్ద ఎత్తున జాబ్మేళాకు హాజరైంది. ఇప్పటికే పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం మంచి ఆఫర్ కోసం జాబ్ మేళాకు తరలివచ్చారు. 3వేల ఉద్యోగాలను కల్పించేందుకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి జాబ్ మేళాలోనే నియామక ఉత్తర్వులను అందజేశారు. మరికొందరికి రెండో విడతలో ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్ట్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. జాబ్మేళాను బేగంపేట్ ఏసీపీ పృథ్వీథర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక సీఐ శ్రీనివాస్ మేళాను పర్యవేక్షించారు.
మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం
మాది వరంగల్. హైదరాబాద్లో ఉంటున్నాం. బీసీఏ ఫైనలియర్ చదువుతున్నాను. ఉద్యోగ మేళా పెట్టారని తెలుసుకొని వచ్చాను. మొదటి ప్రయత్నంలోనే ఆడ్రాయిట్ నియోటెక్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నా. అందుకు ఈ ఉద్యోగం తోడ్పాటునందిస్తుందని అనుకుంటున్నా. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయం. 30న ఉద్యోగంలో చేరుతా.
– వి.సాయి సమీర్ కుమార్
భవిష్యత్కు కొత్త బాటలు
మంచి పేరున్న ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న. ఇంకా పెద్ద కంపెనీ, మంచి జీతం కోసం ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని మనం అందిపుచ్చుకొని భవిష్యత్కు కొత్త బాటలు వేసుకోవాలి. ఇందులో భాగంగా కెరీర్ను డెవలప్ చేసుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు జాబ్మేళాకు వచ్చాను.
-సుమ