సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్ 10వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీకి సంబంధించి మొత్తం 95 గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థుల తుదిజాబితా వివరాలను బుధవారం అధికారులు ప్రకటించారు. 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి త్వరలో నిర్వహించే స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్స్తోపాటు డిగ్రీలు ప్రదానం చేస్తామని జేఎన్టీయూ డైరెక్టర్ ఎవాల్యూయేషన్ ప్రొఫెసర్ చంద్రమోహన్ తెలిపారు. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గోల్డ్మెడల్స్ జాబితా విడుదల చేశామన్నారు. ఈ రెండు విద్యా సంవత్సరాలకు కలిపి మొత్తం 1.10 లక్షల మంది విద్యార్థులకు వచ్చేనెలలో నిర్వహించే స్నాతకోత్సవంలో డిగ్రీలు ప్రదానం చేస్తామని, స్నాతకోత్సవం తేదీ, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని వీసీ కట్టా నరసింహారెడ్డి చెప్పారు.