సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): ‘మన యాస.. భాషను తెలుగు రాష్ర్టాల వారు గుర్తు పట్టేస్తున్నారు. మన మాటలను నమ్మడం లేదు. హిందీ, ఆంగ్ల పదాలను గుర్తిస్తున్నారు. వెంటనే ఫోన్లు కట్ చేస్తున్నారు. వారిని బోల్తా కొట్టించాలంటే వారి భాషలోనే మాయ చేయాలి’ అని ఉత్తరాది సైబర్ గ్యాంగ్లు కొత్త వ్యూహాలను పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో డబ్బులు అవసరం ఉన్న వారికి గాలం వేస్తున్నాయి. ఇందుకోసం ముఠా సభ్యులు ప్రత్యేకంగా జార్ఖండ్ నుంచి వచ్చి నగరంలో తిరుగుతున్నారు. అవకాశం దొరకగానే కొందరికి భారీ జీతాలను ఆఫర్ చేస్తూ.. జార్ఖండ్కు తీసుకెళ్తున్నారు. అక్కడ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ.. 30 శాతం కమీషన్లను ఆశచూపి.. తెలుగు రాష్ర్టాల ప్రజలను వారి భాషలోనే మాట్లాడించి.. బోల్తా కొట్టిస్తున్నారు. ఖాతాలు ఖాళీ చేయిస్తున్నారు.
పలు అంశాలు వెల్లడి
జార్ఖండ్లో రాచకొండ పోలీసులు పీటీ వారెంట్పై తొమ్మిది మంది తెలుగు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయడంతో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఉత్తరాది సైబర్ ముఠాలు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన నిరుద్యోగులకు ప్రత్యేకంగా ఎలా మాట్లాడాలనే అంశంపై శిక్షణను ఇచ్చినట్లు తేలింది. ధన్బాద్ ప్రాంతానికి తరలించి.. అక్కడ ఓ ఫ్లాట్ను కేటాయిస్తున్నారు. భోజనంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇలా తీసుకెళ్లిన వారిని ఆ ఫ్లాట్లో నుంచి బయటికి రాకుండా కావాల్సిన అన్నింటినీ సమకూరుస్తున్నారు. సిమ్కార్డులు, తెలుగు రాష్ర్టాలకు చెందిన వారి ఫోన్నంబర్లను కూడా ముందే ఇచ్చేస్తున్నారు. వారితో తెలుగులో మాట్లాడించి.. నగదును కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా అమాయకుడు చిక్కితే వారి నుంచి బదిలీ చేసుకున్న సొత్తులో 30 శాతం కమీషన్ను స్పాట్లోనే ఇస్తున్నారు. ఇలా రోజుకు దాదాపు వందల మందికి ఫోన్లు చేసి.. తెలుగులో మాట్లాడుతూ ఉత్తరాది ముఠాలు డబ్బులను దోచుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగు వారిని ఫైనాన్స్లు, రుణాల పేరుతో ఇస్తామని బోల్తా కొట్టిస్తున్నాయి.
వనపర్తి జిల్లా వాసులు
వనపర్తి జిల్లాకు చెందిన కత్రావత్ రాజుకు సైబర్ నేరగాడు జార్ఖండ్కు చెందిన విక్రమ్ ఠాకుర్ పరిచయమాయ్యడు. అతడి మాటలకు ఆకర్షితుడైన రాజు.. తన బంధువులు, స్నేహితులు సంతోష్, గణేశ్, వెంకటేశ్, రాజు, శ్రీనివాసులు, హరిలాల్, గణేశ్, ఎం.గణేశ్లను జార్ఖండ్కు తీసుకెళ్లాడు. ఏడాది పాటు తెలుగు రాష్ర్టాల ప్రజలను కొల్లగొట్టారు.
రూ. 11 లక్షలకు పైగా..
జార్ఖండ్కు వెళ్లిన వనపర్తి జిల్లాకు చెందిన మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వారు జార్ఖండ్లో సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఇక్కడకు వచ్చి పరీక్షలు రాసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అంతేకాకుండా నేరాలకు పాల్పడి వచ్చిన సొత్తుతో ఇటీవల గ్రామానికి వచ్చి వారు దావత్లు సైతం చేసుకున్నట్లు తేలింది. మొత్తం రూ. 11 లక్షలకు పైగా దోచుకున్నారని వెల్లడైంది. కాగా, ముఠాల వద్ద తెలుగు రాష్ర్టాలకు చెందిన వివిధ సంస్థల ఫోన్ వినియోగదారులు చిట్టాతో పాటు ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంక్ల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల డేటా కూడా ఉందని స్పష్టమైంది.