సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో మరొకటి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల ప్లాంటు అందుబాటులోకి రాగా.. తాజాగా దుండిగల్లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంటును వినియోగంలోకి తీసుకువచ్చారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించాలని కేసీఆర్ పభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను చేపట్టింది.
దుండిగల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ ప్లాంటుతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యం 34.5 మెగావాట్లకు చేరుకున్నది. అంతేకాకుండా కేసీఆర్ సర్కారు ముందుచూపుతో చేపట్టిన పవర్ ప్రాజెక్టులు మరో నాలుగు ఈ ఏడాది చివరి నాటికల్లా అందుబాటులోకి వచ్చి సామర్థ్యం ఏకంగా 101 మెగావాట్లకు చేరుకోనుండడం గమనార్హం. కాగా చెత్త నుంచి కరెంటును ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువచ్చి వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నది.
ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (ఎస్సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు. తరలించిన వెంటనే అకడ యాంత్రికంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. తద్వారా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుకు ఆ చెత్తను తరలించి కరెంటును ఉత్పత్తి చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. తాజాగా దుండిగల్లో రోజుకు 1500 టన్నుల చెత్త ద్వారా 800 టన్నుల ఆర్డీఎఫ్ (రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్) ఉత్పత్తి చేసి 14.5 మెగావాట్ల కరెంట్ను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. తర్వాతి దశలో జవహర్నగర్ ఫేజ్-2, ఫ్యారానగర్, యాచారం, బీబీ నగర్లో ఎనర్జీ ప్లాంటును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు వేగిరం చేశారు.