రంగారెడ్డి జిల్లా కోర్టులు, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మాయ మాటలతో మైనర్ బాలికను మభ్యపెట్టి ముంబై తీసుకువెళ్లి పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారుర్ మండలం నాగసాన్పల్లికి చెందిన బాలిక తండ్రి వద్ద కావలి రాజు పని చేసేవాడు. అదే సమయంలో మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు అక్టోబర్ 2012లో బాలికను ముంబయికి తీసుకువెళ్లాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఎనిమిది నెలల పాటు సహజీవనం చేశాడు. తర్వాత సొంత గ్రామానికి వెళ్తున్నామని చెప్పి బాలికను ధారూర్ బస్టాండ్ సమీపంలో విడిచిపెట్టిపోయాడు. తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న బాలిక ధారూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.