సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/మైలార్దేవ్పల్లి : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న బిడ్డలపై అఘాయిత్యానికి సహకరించిన తల్లితో పాటు మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.35 వేల జరిమానా విధిస్తూ మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి సురేశ్ తీర్పు ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. కాటేదాన్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు(మైనర్లు). వీరు స్థానిక పాఠశాలలో చదువుకున్నారు. ఈ చిన్నారుల తల్లికి ప్రధాన నిందితుడు సయ్యద్ సాధిక్తో పరిచయం ఉంది. అప్పడప్పుడు వారి ఇంటికి వచ్చే సాధిక్ చిన్నారులపై కన్నేశాడు. చిన్నారులతో తన కోరిక తీర్చుకోవడానికి సహకరించాలని తల్లిని కోరాడు. అందుకు ఆమె అనుమతించింది. సాధిక్తో పాటు అతడి కుమారుడు(మైనర్) కూడా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.
దీనిపై ఆ బాధిత చిన్నారులు తండ్రికి విషయం తెలుపగా, అతడు భయపడి కాటేదాన్ నుంచి మకాం మార్చాడు. అక్కడ సైతం నిందితులు ప్రదీప్ అగర్వాల్, సంతోష్కుమార్, రాహుల్ మండల్ ఆ ఇద్దరు చిన్నారుల పట్ల అమానుషంగా, అసభ్యంగా ప్రవర్తించారు. 2016లో ఆ చిన్నారులిద్దరూ స్కూల్కి వెళ్లి.. జరిగిన ఘోరాన్ని టీచర్కు వివరించగా, వారు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారి దేవేంద్రాచారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం చిన్నారుల తల్లితో పాటు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.