సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ‘సారథి’ పోర్టల్ను తెలంగాణ రవాణా శాఖ రద్దు చేయాలని వాహన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సీఎఫ్ఎస్టీ పోర్టల్ తీసుకురావాలన్నారు. అందులో భాగంగా వాహన సంఘాల జేఏసీ నాయకులు ఇప్పటికే రవాణా శాఖ జాయింట్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. కాగా, సారథి పోర్టల్తో లైసెన్స్ ప్రక్రియ జఠిలంగా మారిందని సోమవారం ఒక ప్రకటనలో టీఏడీయూ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి అన్నారు. త్రీవీలర్ లైసెన్స్ ప్రక్రియ సారథి పోర్టల్లో కనిపించడం లేదని దుయ్యబట్టారు.
ఆటో లైసెన్స్ కోసం వెళితే కారు నడపమంటున్నారని చెప్పారు. సారథిలో త్రీవీలర్ ఆప్షన్ లేదని అదికారులు చెబుతున్నట్టు వివరించారు. స్లాట్ బుక్ చేయడానికి కూడా గంటల తరబడి సమయం వెచ్చించాల్సి ఉంటుందని తెలంగాణ ఆటో యూనియన్ నేత వేముల మారయ్య అన్నారు. సాంకేతిక సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది తమ పరిధిలో లేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెబుతున్నట్టు పేర్కొన్నారు.